
సినిమా ఎంత పెద్ద విజయం సాధించినా పైరసీ రూపంలో నష్టాలను ఎదుర్కోక తప్పడం లేదు. లేటెస్ట్ గా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన చావా (Chhaava) మూవీపై అదే అవతరిస్తోంది. విక్కీ కౌశల్ (Vicky Kaushal) , రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ రూ.400 కోట్ల (నెట్) వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పుడే తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.
Chhaava
మార్చి 7న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే, సినిమా బిగ్ హిట్ అయినా తాజాగా చావా పైరసీ సమస్యతో ఎదుర్కొంటోంది. మరీ దారుణంగా 5.1 డాల్బీ అట్మాస్తో కూడిన 4K ప్రింట్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ లీక్ మూలంగా బాక్సాఫీస్ వసూళ్లపై నేరుగా ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. చాలా మంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే పైరసీ వెర్షన్ చూసేస్తుండటంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పడం లేదు.
అంతేకాదు, ఓటీటీ రిలీజ్ కోసం వేచి చూసే ప్రేక్షకులు కూడా ఇప్పటికే లీకైన వెర్షన్ను డౌన్లోడ్ చేసుకుని చూస్తుండటంతో ఓటీటీ వసూళ్లు కూడా దెబ్బతింటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ ఫిల్మ్ అసోసియేషన్లు, యాంటీ-పైరసీ సెల్లు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పైరసీ వలన వేలాది మంది టెక్నీషియన్ల శ్రమ, నిర్మాతల పెట్టుబడులు పోతున్నాయని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, వాటర్మార్కింగ్ వంటి పద్ధతులను మరింత పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా చావా లాంటి భారీ సినిమా కూడా పైరసీ బారినపడుతుండటంతో మిగతా చిత్రాల పరిస్థితి ఏమిటనే దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. పైరసీని పూర్తిగా నియంత్రించలేకపోతే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు బలైపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.