సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశను పూర్తి చేసుకుని షూటింగ్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో కథ ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక ఎపిసోడ్ ప్రాచీన కాశీ నగరంలోని మణికర్ణిక ఘాట్ నేపథ్యంలో సాగుతుందని టాక్.
SSMB29
ఈ ఘాట్ పవిత్ర స్థలంగా పేరొందినప్పటికీ, అక్కడ షూటింగ్ అనుమతులు తీసుకోవడం కష్టం. అందుకే హైదరాబాద్లోనే అదే తరహా భారీ సెట్ నిర్మించి, విఎఫ్ఎక్స్ సాయంతో ఆ ఎపిసోడ్ను రియలిస్టిక్గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. రాజమౌళి సినిమాల్లో గ్రాండ్ విజువల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ భారీ సెట్స్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే ప్రియాంక చోప్రా కథానాయికగా ఫైనల్ అయిందని ప్రచారం.
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ భారీ క్రేజ్ ఉన్న ప్రియాంక, చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం 35-40 కోట్ల రెమ్యునరేషన్ ఆమెకు ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఇదే నిజమైతే, ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నిలవనుంది. 1000 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యా, బ్రెజిల్, థాయిలాండ్ వంటి లొకేషన్లను రాజమౌళి ఇప్పటికే పరిశీలించారని సమాచారం.
ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక గ్లోబల్ అడ్వెంచర్ ట్రావెలర్ పాత్రలో కనిపించనున్నారని, హాలీవుడ్ నుంచి మరికొంతమంది ప్రముఖ నటీనటులు కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నట్లు టాక్. అయితే ఇంకా అధికారికంగా నటి, ఇతర తారాగణంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీరవాణి (M. M. Keeravani) సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.